ఏసర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోనూ సూద్..

23 Sep, 2020 20:20 IST|Sakshi

ముంబై: దేశంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ ఏసర్‌ ఇండియా అనే ప్రముఖ ల్యాప్‌టాప్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని సంస్థ ప్రకటించింది. ఏసర్‌లో ఉన్న సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్‌ సాంకేతికతతో ఏసర్‌ ఇండియా అకట్టుకుంటుందని సంస్థ పేర్కొంది.

ఏసర్‌ ఇండియా ఎండీ హరీష్‌ కోహ్లి స్పందిస్తూ.. తమ సంస్థకు సోనూ సూద్ లాంటి మానవతావాది, రియల్‌ హీరో బ్రాండ్‌ ప్రమోషన్‌ చేయడం సంతోషకరమని అన్నారు. వినియోగదారులకు సరికొత్త సాంకేతికతను అందించడానికి ఏసర్‌ ఇండియా కృషి చేసినట్లు హరీష్‌ కోహ్లి పేర్కొన్నారు. మరోవైపు దేశంలో టెక్నాలజీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లెందుకు సోనుసూద్‌ లాంటి టాలెంటడ్‌ నటుడు తమ సంస్థ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడం సంతోషకరమని ఏసర్‌ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫిసర్‌ సుదీర్‌ గోయల్‌ పేర్కొన్నారు. కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఏసర్‌ ఇండియా 1976లో స్థాపించబడింది. మెరుగైన సేవలతో ప్రపంచ వ్యాప్తంగా ఏసర్‌ ఇండియా దిగ్గజ కంపెనీల జాబితాలో చేరింది. ప్రస్తుతం160 దేశాలలో ఏసర్‌ తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (చదవండి: ‘నన్ను విమర్శించే బదులు ఎవరికైన సాయం చేయండి’)

మరిన్ని వార్తలు