గూగుల్‌కు అదానీ డేటా సెంటర్‌ లీజ్‌, నెలవారీ అద్దె రూ.11కోట్లు

12 Oct, 2022 08:55 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ అయిన అదానీ ఎడ్జ్‌ కనెక్స్‌.. నోయిడాలోని తన డేటా కేంద్రంలో 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రెయిడెన్‌ ఇన్ఫోటెక్‌కు లీజ్‌కు ఇచ్చింది. రెయిడెన్‌ గూగుల్‌కు చెందిన సంస్థ. నెలవారీ అద్దె రూ.11 కోట్లు చెల్లింపుపై పదేళ్ల కాలానికి ఈ డీల్‌ కుదిరినట్టు సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ అనే సంస్థ వెల్లడించింది. 

చదరపు అడుగుకు ప్రతి నెలా రూ.235 చెల్లించేలా ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత వార్షిక అద్దె రూ.130.89 కోట్లు కాగా, తర్వాత ఏటా ఒక శాతం పెంచేందుకు అంగీకారం కుదిరింది. సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సేకరించిన పత్రాల ఆధారంగా గత నెలలోనే ఈ డీల్‌ కుదిరినట్టు తెలుస్తోంది. 

దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణకు గాను 2021 ఫిబ్రవరిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎడ్జ్‌కనెక్స్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటును ప్రకటించడం తెలిసిందే. చెన్నై, నవీ ముంబై, నోయిడా, వైజాగ్, హైదరాబాద్‌లో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది సంస్థ లక్ష్యంగా ఉంది.    

మరిన్ని వార్తలు