Adani Group vs Hindenburg: లక్షల కోట్లు ఢమాల్‌, ఇన్వెస్టర్లలో ఆందోళన

27 Jan, 2023 13:54 IST|Sakshi

సాక్షి, ముంబై: అదానీ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల నివేదికను విడుదల చేసిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో కంపెనీలు 8 శాతం వరకు నష్టపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం కూడా  అదానీ షేర్లలో మరింత అమ్మకాలు వెల్లు వెత్తాయి. మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్‌లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. దీంతో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా  కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. కలకలం రేపుతున్న ఈ వివాదం నేపథ్యంలోని ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది.

అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరో ముఖ్యమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ 12 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా అంబుజా సిమెంట్‌, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా, అదానీ పవర్‌, అదానీ విల్‌మార్‌ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి.

హిండెన్‌బర్గ్‌ ప్రతి సవాల్‌
మరోవైపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై దావా వేయనున్నట్టు అదానీ ప్రకటించింది.  అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల క్రింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్‌లో తెలిపింది. అటు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఆర్‌బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్  ఊపందుకుంది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌  చేసిందంటూ గౌతమ్ అదానీ  నేతృత్వంలోని అదానీ గ్రూపుపై  జనవరి 24, మంగళవారం అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  సంచలన నివేదిక  ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు