అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం: ఆర్బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

8 Feb, 2023 17:00 IST|Sakshi

సాక్షి,ముంబై: అదానీ గ్రూపు- హిండెన్‌బర్గ్ రిపోర్ట్  వివాదం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పరోక్షంగా స్పందించారు. అదానీ గ్రూప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, బ్యాంకింగ్‌ రంగంపై ప్రభావంపై  గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంఘటన లేదా కేసు ద్వారా  బ్యాంకులు ప్రభావితం అయ్యే అవకాశం లేదని అన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, మరింత బలోపేతం చేసుకునేందుకే చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఆర్‌బీఐ పాలసీ ప్రకటనల అనంతరం విలేకరుల సమావేశంలో  శక్తికాంత దాస్‌మాట్లాడుతూ, నిర్దిష్ట కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవని పేర్కొన్నారు.  వాటి బలం, ఫండమెంటల్స్, నగదు ప్రవాహం, ఇతర అంశాల ఆధారంగా రుణాలు ఇస్తారని చెప్పారు.  కార్పొరేట్ల కంపెనీల  రుణాలపై మాట్లాడుతూ అన్ని బ్యాంకులు పెద్ద ఎక్స్‌పోజర్ మార్గదర్శకాలను పాటించాయని కూడా ఆయన  స్పష్టం చేశారు. అలాగే సంక్షోభం అంచున ఉన్న అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నిలకడగా కొనసాగుతున్నాయని ప్రకటించరాఉ.

మరిన్ని వార్తలు