PLI Scheme: కేంద్ర ప్రభుత్వ పథకం, పీఎల్‌ఐకి ఎంపికైన అదానీ సంస్థ!

29 Jun, 2022 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ: అదానీ కాపర్‌ ట్యూబ్స్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ తదితర 15 కంపెనీలు వైట్‌ గూడ్స్‌ రంగానికి (ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు) సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద ఎంపికయ్యాయి. రూ.1,368 కోట్లను ఇవి పెట్టుబడులుగా పెట్టనున్నాయి.

వైట్‌ గూడ్స్‌ – ఎయిర్‌ కండీషనర్లు (ఏసీలు), ఎల్‌ఈడీ లైట్లకు సంబంధించి మలి విడత దరఖాస్తులకు మార్చిలో కేంద్ర వాణిజ్య శాఖ అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టి, అదనపు తయారీని సృష్టించే కంపెనీలకు రూ.6,238 కోట్లను ప్రోత్సహకాలుగా ఇవ్వనుంది.

గతేడాది డైకిన్, ప్యానాసోనిక్, సిస్కా, హావెల్స్‌ సహా 46 సంస్థలు రూ.5,264 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు తొలి విడతలో ఆమోదం లభించడం గమనార్హం. రెండో దశలో 19 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటి నుంచి 15 కంపెనీలను ఎంపిక చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. మిగిలిన నాలుగు కంపెనీలు.. జెకో ఎయిర్‌కాన్‌ (రూ.100 కోట్ల పెట్టుబడులు), ఈఎంఎం ఈఎస్‌ఎస్‌ ఎయిర్‌కాన్‌ (రూ.52 కోట్లు), స్పీడ్‌ఆఫర్‌ ఇండియా (రూ.18 కోట్లు), సిమోకో టెలీ కమ్యూనికేషన్స్‌ (దక్షిణాసియా) (రూ.10.63కోట్లు) దరఖాస్తులను మరింత పరిశీలన కోసం నిపుణుల కమిటీకి పంపినట్టు తెలిపింది. 

ఏసీ, ఎల్‌ఈడీ విభాగాల తయారీ..  
‘‘ఎంపికైన 15 సంస్థల్లో 6 ఏసీ విడిభాగాలను తయారు చేయనున్నాయి. ఇవి రూ.908 కోట్లను తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై వెచి్చంచనున్నాయి. తొమ్మిది సంస్థలు ఎల్‌ఈడీ లైట్ల విడిభాగాల తయారీ కోసం రూ.460 కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నాయి. ఈ 15 కంపెనీలు ఉమ్మడిగా రూ.25,583 కోట్ల ఉత్పత్తిని ఐదేళ్లలో నమోదు చేయనున్నాయి. ఏసీ, ఎల్‌ఈడీకి సంబంధించి దేశంలో పూర్తి స్థాయి విడిభాగాలను తయారు చేస్తాయి. 4,000 మందికి ఉపాధి కల్పిస్తాయి’’అని కేంద్ర వాణిజ్య శాఖ వివరించింది.

ప్రస్తుతం మన దేశంలో ఎల్‌ఈడీలు, ఏసీల తయారీకి అధిక శాతం విడిభాగాలను చైనా నుంచి దిగుమతిం చేసుకుంటున్నాం. దీన్ని నివారించేందుకు కేంద్ర సర్కారు స్వావలంబన భారత్‌ లక్ష్యంతో వైట్‌ గూడ్స్‌ పరిశ్రమకు పీఎల్‌ఐ కింత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌ కోసం భారత్‌లో తయారీకి సైతం ఇది కీలకం కానుంది.

వైట్‌ గూడ్స్‌ రంగానికి పీఎల్‌ఐ కింద ప్రోత్సాహకాలతో వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.1,22,671 కోట్ల విలువైన ఏసీలు, ఎల్‌ఈడీ లైట్ల విడిభాగాలు దేశీయంగా తయారు కానున్నాయి. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న ఏసీలు, ఎల్‌ఈడీ లైట్ల మొత్తం విలువలో స్థానిక విలువ జోడింపు ప్రస్తుతం 15–20 శాతంగానే ఉందని.. ఇది 75–80 శాతానికి విస్తరిస్తుందని, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం అదనపు సెక్రటరీ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఐదేళ్లలో కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల విలువపై కేంద్ర ప్రభుత్వం ఆరంభంలో 6 శాతం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. చివరిగా 4 శాతానికి తగ్గిస్తుంది.  

మరిన్ని వార్తలు