ఈసారి భారత్‌ వృద్ధి రేటు 7%

15 Dec, 2022 06:29 IST|Sakshi

ఏడీబీ గత అంచనాలు యథాతథంగా కొనసాగింపు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందంటూ సెప్టెంబర్‌లో వేసిన అంచనాలను ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా అప్‌డేట్‌లో యథాతథంగా కొనసాగించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశీయంగా వినియోగదారుల ధీమా, విద్యుత్‌ సరఫరా, పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీలు మొదలైనవి ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది.

అయితే, ఎగుమతులు .. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ముడి ఇనుము మొదలైనవి అంత సానుకూలంగా కనిపించడం లేదని ఏడీబీ ఒక నివేదికలో తెలిపింది. 2022–23లో ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరి, తర్వాత 5.8 శాతానికి దిగి రావచ్చని వివరించింది. 2023–24కి సంబంధించిన అంచనాలను 7.2 శాతం స్థాయిలో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఏడీబీ తెలిపింది. 2021–22లో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. మరోవైపు, ఆసియా వృద్ధి అంచనాలను ఏడీబీ కుదించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 4.2 శాతంగాను, వచ్చే ఏడాది (2023) 4.6 శాతంగాను ఉండొచ్చని పేర్కొంది. గతంలో ఇది వరుసగా 4.3 శాతం, 4.9%గా ఉండొచ్చని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు