విమాన ప్రయాణం.. మీ మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయమంటారు, ఎందుకో తెలుసా?

17 Jan, 2023 12:51 IST|Sakshi

గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తే కాలక్షేపానికి మొబైల్‌ వాడకం సాధారణమే. అదే విమానంలో ప్రయాణం అంటే మాత్రం మన స్మార్ట్‌ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేయాలని లేదా ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్తుంటారు. అసలు బస్సు, రైలు, బైకు వీటిలో ప్రయాణించేటప్పుడు లేని ఈ నిబంధన కేవలం విమాన ప్రయాణంలోనే ఎందుకు పాటించాలి.  మీ సెల్యులార్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం విమానానికి నిజంగా ప్రమాదం కలిగించగలదా?అలా చేయడం వెనుకు దాగున్న సైంటిఫిక్‌ కారణాల పై ఓ లుక్కేద్దాం!

విమాన ప్రయాణంలో మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌..
విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్యాసింజర్లు వారి మొబైల్స్‌ను స్విచ్ ఆఫ్ చేయమని అందులోని సిబ్బంది చెప్తుంటారు. అయితే విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA). కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం ఈ నిబంధన పాటించమని చెబుతుంటారు.

దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే (Radio Frequencies). ఇవి విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి.   దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగిస్తుంది.  ఒకవేళ అదే జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

విమాన ప్రయాణం సజావుగా సాగాలన్నా, మన స్మా‍ర్ట్‌ఫోన్‌ ఉపయోగించలన్నా ఈ రెండు సిగ్నల్‌ వ్యవస్థ మీద ఆధారపడి పని చేస్తాయి. అందుకే విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేది. ఇప్పటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరగలేదు.

కాకపోతే.. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనే ప్రక్రియ చాలా కీలకమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా ప్రారంభించాయి.

చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నారో తెలుసా?

మరిన్ని వార్తలు