ఉద్యోగుల తొలగింపు వేళ .. గూగుల్‌ మరో కీలక నిర్ణయం!

25 Feb, 2023 09:38 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా ఎంత వీలైతే అంత ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్‌.. తాజాగా క్లౌడ్‌ ఉద్యోగులు వారి సహచర ఉద్యోగులు డెస్క్‌లు వినియోగించుకోవాలని కోరింది. తద్వారా నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తోంది.  

‘రియల్‌ ఎస్టేట్‌ ఎఫిషెన్సీ’ (హాల్‌ తరహాలో డెస్క్‌లు) పేరుతో గూగుల్‌ ఆఫీస్‌లో డెస్క్‌ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్‌ వర్కింగ్‌ విధానంలో వారంలో 2 రోజులు ఇంటిలో, 3 రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారు. వారంతంలో శని, ఆదివారాలు సెలవులే. 

ఇప్పుడు ఈ విధానంలో గూగుల్‌ మార్పులు చేస్తుంది. ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీస్‌లో వర్క్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలని తెలిపింది. తదనుగుణంగా కార్యాలయాల్లో డెస్క్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నల్‌ మీటింగ్‌లో పేర్కొంది.  ఇప్పుడు ఉద్యోగులకు విడివిడిగా డెస్క్‌లు లేవని, ఒకరి డెస్క్‌లు మరొకరు వాడుకోవాలని సూచించింది. అయితే, డెస్క్‌ అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులు ఆఫీస్‌కు రావొచ్చని .. ఆఫీస్‌లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ  కూర్చొని పనిచేసుకోవాలని స్పష్టం చేసింది.  

చదవండి👉 గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు!

మరిన్ని వార్తలు