18 వేల మార్క్‌ దిగువన నిఫ్టీ.. స్టాక్‌ మార్కెట్‌లో భారీ నష్టాలు

19 Jan, 2022 14:27 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. మార్కెట్‌ ప్రారంభమైంది మొదలు వరుసగా నష్టాలు చవి చూస్తున్నారు ఇన్వెస్టర్లు. అరబ్‌ దేశాల్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు, క్రూడ్‌ఆయిల్‌ ధర పెంపు, ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు దేశీ ఇన్వెస్టర్ల నడ్డి విరిచాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయానికి నిఫ్టీ మరోసారి 18 వేల మార్క్‌ కిందికి రాగా సెన్సెక్స్‌ సైతం మరోసారి 60 వేల పాయింట్ల కోల్పోయేందుకు అడుగు దూరంలో నిలిచింది.

అంతర్జాతీయ పరిణామాలు
ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో ప్రపంచ వ్యాప్తంగా చమురు వినియోగం తగ్గిపోయింది. దీంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలను మరోసారి ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని 87 డాలర్ల దగ్గర నమోదు అవుతోంది. దీంతో మార్కెట్‌లో ఆందోళన నెలకొంది. మరోవైపు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచడంతో ఒక్కసారిగా విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ. 1255 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. బుధవారం సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. దీంతో ఉదయం నుంచి రెండే దేశీ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

కోట్ల సంపద ఆవిరి
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ రోజు ఉదయం 18129 పాయింట్ల దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభమైంది. కొద్ది సేపే లాభాల్లో కొనసాగింది.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ ఓ దశలో 17,884 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో 217 పాయింట్లు నష్టపోయి 17,895 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 60,845 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ మొదలైంది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం 2:20 గంటల ఏకంగా 708 పాయింట్లు నష్టపోయి 60,046 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మంగళవారం సెన్సెక్స్‌ 554 పాయింట్లు, నిఫ్టీ 195 పాయింట్లు నష్టపోతే ఇన్వెస్టర్లు 3.74 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. ఇదే ట్రెండ్‌ సాయంత్రం వరకు కొనసాగితే మరోసారి ముదుపరులకు, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న వారికి భారీ నష్టాలు తప్పవు. 

మరిన్ని వార్తలు