నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ!

31 May, 2023 19:35 IST|Sakshi

చాట్‌జీపీటీ  సాంకేతిక రంగంలో అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ‘ఔరా’ అనిపిస్తోంది. అయితే ఇప్పుడీ టెక్‌ బాట్‌ పీపాలకు పీపాలకు నీళ్లు తాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నీటి కరువుకు దారి తీస్తుందేమోనని అమెరికన్‌ సైంటిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మీరు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేలా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ నిర్వహణ భారం ఎక్కువగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ‍్యంగా, ఒక యూజర్‌ అడిగిన 20 నుంచి 50 ప‍్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అరలీటర్‌ (500 ఎంఎల్‌) నీటిని వినియోగిస్తుంది. విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచేందుకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. 

నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది
కృత్రిమ మేధ (AI) నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది. భారీ సర్వర్ గదులను చల్లబరచడానికి నేరుగా నీటిని ఉపయోగిస్తుంది. ఆ సర్వర్‌లకు పవర్ స్టేషన్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను పరోక్షంగా ఉపయోగిస్తుంది. అలా నీరు వినియోగం భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు పలు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

నీటి వినియోగంలో ముందంజ
సాంకేతిక విభాగంలో ప్రాచుర్యం పొందిన కృత్తిమ మేధ చాట్‌ బాట్‌ ‘చాట్‌జీపీటీ, బార్డ్‌లు నీరు లేకుండా పనిచేయలేవు. అవి పని చేయాలంటే సర్వర్లు 10-27 డిగ్రీల సెల్సియస్ కూలింగ్‌ ఉండాలి. ఆ కూలింగ్‌ను కొనసాగించేందుకు సర్వర్‌ల వద్ద కూలింగ్ టవర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. సర్వర్లు వినియోగించే ప్రతి యూనిట్ (కిలోవాట్) విద్యుత్ కోసం, కూలింగ్ టవర్లు ఒక గాలన్ (3. 8 లీటర్లు) నీటిని ఉపయోగిస్తాయి.

కూలింగ్‌ టవర్లు ఎలా పనిచేస్తాయి
కూలింగ్‌ టవర్లు గదిలోని ఉష్ణోగ్రత ఆధారంగా పనిచేస్తాయి. నీరు ఆవిరైనప్పుడు పరిసరాల నుండి వేడిని గ్రహిస్తుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కూలింగ్ టవర్ లోపల నీటి ఆవిరి పెరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. ఫలితంగా, డేటా సెంటర్లు ఉపయోగించే నీరు తగ్గిపోతుంది. ఆ నీటిని రీసైకిల్ చేసేందుకు వీలు లేదు. దీంతో నీటి వినియోగం భారీగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని విశేషాలు

20 - 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే చాట్‌ జీపీటీ కనీసం అరలీటర్‌ మంచినీరు వినియోగించాల్సి వస్తుంది

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా నిర్వహించే డేటా సెంటర్‌లో  7లక్షల లీటర్ల మంచి నీటి వినియోగం జరుగుతోంది. ఆ కేంద్రంగా ఓపెన్‌ ఏఐ సంస్థ జీపీటీ-3 మోడల్‌పై పనిచేస్తోంది. కరెంట్‌ వినియోగం కారణంగా 2.8 మిలియన్‌ లీటర్ల నీళ్లను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. 

ఒక్క అమెరికాలో జీపీటీ-3 ‘3.5 మిలియన్‌ లీటర్ల నీటిని ఉపయోగిస్తుండగా.. ఏసియా, పసిపిక్‌ దేశాలతో కలిసి 4.9 లీటర్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. 

జీపీటీ-3 కంటే తాజాగా విడుదలైన చాట్‌జీపీటీ - 4 నీటి అవసరం ఎక్కువగా ఉంది

చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో!

మరిన్ని వార్తలు