ఎయిర్‌ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే !

11 Oct, 2021 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌ తదుపరి అనుబంధ సంస్థల మానిటైజేషన్‌ పనులను ప్రారంభించనున్నట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. అలయన్స్‌ ఎయిర్‌సహా నాలుగు అనుబంధ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను మానిటైజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. రూ. 14,700 కోట్లకుపైగా విలువైన భవనాలు, భూమి తదితర ఆస్తులను ఇందుకు వినియోగించనున్నట్లు తెలియజేశారు.  ఎయిరిండియాకు చెందిన ఈ నాలుగు అనుబంధ సంస్థలు ఏఐఏహెచెఎల్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ(ఎస్‌పీవీ)లో భాగమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ నెల 8న ఎయిరిండియాను రూ. 18,000 కోట్ల విలువైన బిడ్‌తో టాటా గ్రూప్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్‌ నగదు రూపేణా రూ. 2,700 కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా రూ. 15,300 కోట్ల రుణభారాన్ని స్వీకరించనుంది. ఈ డీల్‌ డిసెంబర్‌కల్లా పూర్తికావచ్చని అంచనా. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తోపాటు, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవల సంస్థ ఏఐఎస్‌ఏటీఎస్‌ సైతం టాటా గ్రూప్‌ గూటికి చేరనున్నాయి.

చదవండి : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు?

>
మరిన్ని వార్తలు