డ్రోన్‌ పైలట్‌ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్‌బస్‌

7 Jun, 2023 10:35 IST|Sakshi

ముంబై: యూరోపియన్‌ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిర్‌బస్‌ భారత్‌లో డ్రోన్‌ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్‌ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి.

సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జూన్‌ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్‌ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్‌ శిక్షణతో పాటు ప్రాక్టికల్‌ ఫ్లయింగ్‌ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 

10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే..  వట్టి చేతులు చాలు! పేమెంట్‌ ఈజీ

మరిన్ని వార్తలు