భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. లాభాల్లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ

22 May, 2023 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. నష్టాలను వీడి రూ. 3,400 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) దాదాపు రూ. 804 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. 2020–21లో మరింత అధికంగా రూ. 3,176 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది ప్రధానంగా దేశీ విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతో కంపెనీ ఆర్థికంగా బలపడింది.

వెరసి కరోనా మహమ్మారి బయటపడ్డాక కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం గమనార్హం! కాగా.. ఇవి ప్రొవిజనల్‌ ఫలితాలు మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆడిట్‌ తదుపరి కంపెనీ తుది పనితీరు వెల్లడికానున్నట్లు తెలియజేశాయి. 2022లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 47 శాతం జంప్‌చేసి 12.32 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 8.38 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రయాణికుల సంఖ్య 52 శాతం ఎగసి 3.75 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు

మరిన్ని వార్తలు