జియోకు షాకిస్తున్న ఎయిర్‌టెల్

22 Mar, 2021 08:14 IST|Sakshi

జియో యాక్టివ్‌ చందాదారులు డిసెంబరుతో  పోలిస్తే  34 లక్షలు క్షీణత

జనవరిలో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 69 లక్షల యాక్టివ్‌ యూజర్లు 

సాక్షి, న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఖాతాలో జనవరిలో కొత్తగా 69 లక్షల యాక్టివ్‌ యూజర్లు చేరారు. డిసెంబరుతో పోలిస్తే రిలయన్స్‌ జియో యాక్టివ్‌ చందాదారులు 34 లక్షల మంది తగ్గారని ట్రాయ్‌ గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ (వీఎల్‌ఆర్‌) నివేదిక ఆధారంగా యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తారు. మొత్తం యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి ఎయిర్‌టెల్‌కు 33.6 కోట్లు, జియోకు 32.5 కోట్లకు చేరింది. భారత్‌లో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతున్న జియో మొత్తం చందాదార్ల సంఖ్య 41.07 కోట్లు కాగా, రెండవ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌కు 34.46 కోట్లు ఉన్నారు.   

ఎయిర్‌టెల్‌ కొత్త యూజర్ల చేరికలో బలమైన వృద్ధిని కొనసాగించింది, రిలయన్స్ జియో కంటే మూడు రెట్లు ఎక్కువ చందాదారులను  సాధించడం గమనార్హం​. 2020 ఆగస్టు నుండి 2021 జనవరి మధ్య దాదాపు 25 మిలియన్ల యూజర్లు ఎయిర్‌టెల్‌ సాధించింది. జియో కేవలం 10 మిలియన్లను ఖాతాదారులను దక్కించుకోగలిగింది. క్రియాశీల చందాదారుల మార్కెట్ వాటా విషయానికి వస్తే ఎయిర్టెల్ జియోపై తన ఆధిక్యాన్ని విస్తరించింది మొత్తంమీద ఎయిర్టెల్ గత ఆరు నెలలుగా జియో కంటే ఎక్కువమంది యూజర్లను తన ఖాతాలో వేసుకుంది.  మొత్తం చందాదారులలో 97 శాతానికిపైగా క్రియాశీలకంగా ఉన్నారు. అయితే  జియోకు కేవలం 79శాతం మాత్రమే. అలాగే వోడాఫోన్ ఐడియా గత 15 నెలల్లో మొదటిసారిగా చందాదారులను చేర్చుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు