మొబైల్‌ యూజర్ల కోసం అమెజాన్‌ ప్రైమ్‌

14 Jan, 2021 06:29 IST|Sakshi

ఎయిర్‌టెల్‌తో జట్టు

నెలకు రూ. 89 నుంచి ప్లాన్లు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్‌ యూజర్ల కోసం అమెజాన్‌ ప్రత్యేకంగా ప్రైమ్‌ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్‌ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్‌ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. కేవలం మొబైల్‌ యూజర్ల కోసమే అమెజాన్‌ ఇలాంటి ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఒక్క యూజర్‌కి మాత్రమే పరిమితమయ్యే ఈ ప్లాన్‌లో స్టాండర్డ్‌ డెఫినిషన్‌ నాణ్యతతో ప్రసారాలు పొందవచ్చని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా డైరెక్టర్‌ గౌరవ్‌ గాంధీ తెలిపారు.

బహుళ యూజర్ల యాక్సెస్, హెచ్‌డీ/అల్ట్రా హెచ్‌డీ కంటెంట్, ప్రైమ్‌ మ్యూజిక్, అమెజాన్‌డాట్‌ఇన్‌ ద్వారా ఆర్డర్ల వేగవంతమైన డెలివరీ తదితర సర్వీసుల కోసం 30 రోజుల అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వాన్ని రూ. 131తో పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రీచార్జ్‌ పాయింట్లలో దీన్ని రీచార్జ్‌ చేయించుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ. 129, వార్షికంగా రూ. 999 చార్జితో అందిస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ ఆఫర్‌ కూడా యథాప్రకారం అందుబాటులో ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. దేశీ ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) మార్కెట్లో డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్‌ తదితర సంస్థలతో కంపెనీ పోటీపడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ గతేడాదే మొబైల్‌ యూజర్ల కోసం రూ. 199 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు