ఎయిర్‌టెల్‌: సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయ్‌..

21 May, 2021 14:02 IST|Sakshi

కట్టడికి నిరంతరం పనిచేస్తున్నాం 

ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, వీటితో పాటే సైబర్‌ నేరాలు కూడా పెరిగాయని టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు. తమ కస్టమర్లు ఇలాంటి సైబర్‌ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్నామని, ఎప్పటికప్పుడు భద్రతాపరమైన కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపేడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కస్టమర్లకు ఈ మేరకు ఆయన ఈ-మెయిల్‌ పంపారు. మోసగాళ్లు పాటిస్తున్న విధానాలను వివరించడంతో పాటు డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన మోసాలను ప్రస్తావించారు. 

వీఐపీ నంబర్లను భారీ డిస్కౌంటుతో ఇస్తామని, కస్టమర్ల వివరాల సేకరణ(కేవైసీ) కోసమంటూ ఎయిర్‌టెల్‌ ఉద్యోగుల పేరుతో వచ్చే కాల్స్, ఎస్‌ఎంఎస్‌ మొదలైన వాటి విషయంలో జాగ్రత్త వహించాలని విఠల్‌ సూచించారు. ‘‘ఎయిర్‌టెల్‌ వీఐపీ నంబర్లను ఫోన్‌ ద్వారా విక్రయించదు. ఎలాంటి థర్డ్‌ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించదు. ఇలాంటివి జరిగితే తక్షణం 121కి కాల్‌ చేసి ధృవీకరించుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు సురక్షితంగా చెల్లింపులు జరిపేందుకు  ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే ఫీచర్‌ను ప్రవేశపెట్టామన్నారు.

చదవండి:

Whatsapp: వాట్సాప్‌పై కేంద్రం గరం గరం

మరిన్ని వార్తలు