Airtel 5G Trials In India: భారత్‌లోని తొలి టెలికాం సంస్థగా రికార్డు సృష్టించిన ఎయిర్‌టెల్‌..!

25 Nov, 2021 16:18 IST|Sakshi

దేశవ్యాప్తంగా పలు దిగ్గజ టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా లాంటి సంస్థలు 5జీ ట్రయల్స్‌ను ముమ్మరం చేశాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 700MHz బ్యాండ్‌తో దేశంలో 5జీ ట్రయల్స్‌ టెస్ట్‌ను నిర్వహించిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది.5జీ ట్రయల్స్‌ టెస్ట్‌ను నోకియా భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టెస్ట్‌ను కోల్‌కత్తా నగర శివార్లలో నిర్వహించింది. ఈస్ట్రన్‌ ఇండియాలో నిర్వహించిన తొలి టెస్ట్‌ కూడా ఇదే.     

700 MHz బ్యాండ్ సహాయంతో ఎయిర్‌టెల్‌, నోకియా కంపెనీలు రియల్‌టైమ్‌ పరిస్ధితుల్లో రెండు 3GPP ప్రామాణిక 5G  ప్రాంతాల మధ్య 40 కి.మీల హై-స్పీడ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కవరేజీని సాధించగలిగాయి. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌ నోకియాకు చెందిన 5G పోర్ట్‌ఫోలియో పరికరాలను  వాడింది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ...5జీ టెక్నాలజీలో భాగంగా  కంపెనీ భారత మొట్టమొదటి 700 MHz బ్యాండ్‌లో 5జీ డెమోను నిర్వహించిన తొలి కంపెనీగా ఎయిర్‌టెల్‌ నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఎయిర్‌టెల్‌ ప్రత్యక్ష 4G నెట్‌వర్క్ సహాయంతో తొలి  5G టెక్నాలజీ  అనుభవాన్ని ప్రదర్శించింది. 
చదవండి: అడిడాస్‌ సంచలనం..! ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా మెటావర్స్ పై కసరత్తు

>
మరిన్ని వార్తలు