నెల రోజుల్లోనే 10 లక్షల 5జీ యూజర్లు: ఎయిర్‌టెల్‌

3 Nov, 2022 04:44 IST|Sakshi

న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రణ్‌దీప్‌ సెఖోన్‌ తెలిపారు. యాపిల్‌ ఐఫోన్‌లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ ఇప్పటికే తెలిపారు.

ఐఫోన్‌ల కోసం యాపిల్‌ నవంబర్‌ తొలినాళ్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను విడుదల చేస్తుందని, డిసెంబర్‌ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్‌ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6–9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. 

మరిన్ని వార్తలు