జియోపై ఎయిర్‌టెల్ పైచేయి

29 Jan, 2021 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: 2020 నవంబర్ నెలలో కొత్త యూజర్లను ఆకర్షించడంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోపై భారతీ ఎయిర్‌టెల్ పైచేయి సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం, కొత్తగా 43 లక్షల మందిని తన నెట్‌వర్క్‌ పరిధిలో చందాదారులగా చేర్చుకుంది. దింతో వరుసగా నాలుగు నెలలు పాటు అన్ని టెలికాం కంపెనీల కంటే ఎక్కువగా యూజర్లను ఎయిర్‌టెల్ ఆకర్షించినట్లు ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. రెండో స్థానంలో మరో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో నిలిచింది.(చదవండి: షియోమీ నుంచి సరికొత్త టెక్నాలజీ)

కానీ, ఇప్పటికి మొత్తం ఖాతాదారుల సంఖ్యలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం, నవంబర్ లో 4.37 మిలియన్ల కొత్త యూజర్లను చేర్చుకున్న తర్వాత భారతి ఎయిర్టెల్ మొత్తం చందాదారుల సంఖ్య 33.4 కోట్లకు చేరుకున్నారు. అదే నెలలో 1.93 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకున్న తర్వాత రిలయన్స్ జియో మొత్తం చందాదారుల సంఖ్య 40.8 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే వోడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తమ ఖాతాదారులను కోల్పోయాయి. వొడాఫోన్ ఐడియా 28.9 కోట్ల మందితో మూడోస్థానంలో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 11.8 కోట్ల మంది చందాదారులతో తరవాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇతర కంపెనీల యాక్టీవ్ యూజర్లతో పోలిస్తే మాత్రం వోడాఫోన్ ఐడియా 96.63శాతం యాక్టీవ్ యూజర్లతో పైచేయి సాధించింది. తర్వాత స్థానంలో ఎయిర్‌టెల్ 89.01శాతం, రిలయన్స్ జియో 79.55శాతం యాక్టీవ్ యూజర్లను కలిగి ఉంది. అయితే, నవంబర్ నెలలోనూ వొడాఫోన్‌ భారీగా చందాదారులను కోల్పోయింది. ఆ ఒక్క నెలలోనే 28.9 లక్షల మంది ఖాతాదారులు వొడాఫోన్ ఐడియాను వీడారు. నవంబర్ నెలలో కొత్తగా చేరిన ఖాతాదారులతో మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 1,171.80 మిలియన్ల నుంచి 1,175.27 మిలియన్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది.

మరిన్ని వార్తలు