వరుసగా మూడోసారి రిలయన్స్‌ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్‌లో ఎయిర్‌టెల్‌

20 Apr, 2022 11:14 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో టెలికం చందాదార్ల సంఖ్య 2022 ఫిబ్రవరిలో 116.6 కోట్లు నమోదైంది. జనవరితో పోలిస్తే ఇది 0.29 శాతం తగ్గుదల. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రకారం.. యూపీ తూర్పు, జమ్ము, కశ్మీర్, హర్యానా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మొబైల్‌ కస్టమర్లు తగ్గుముఖం పట్టారు. బ్రాడ్‌బ్యాండ్‌ చందాదార్లు స్వల్పంగా తగ్గి 78.34 కోట్ల నుంచి 78.33 కోట్లకు వచ్చి చేరారు.

మొబైల్‌ సర్వీసెస్‌ విభాగంలో రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లను పోగొట్టుకోగా, కేవలం భారతి ఎయిర్‌టెల్‌ మాత్రమే కొత్త వినియోగదార్లను సొంతం చేసుకుంది. భారతి ఎయిర్‌టెల్‌ నూతనంగా 15.91 లక్షల మందిని చేర్చుకుంది. రిలయన్స్‌ జియో మొబైల్‌ కస్టమర్లను పోగొట్టుకోవడం వరుసగా మూడవసారి. ఫిబ్రవరిలో ఈ సంస్థ నుంచి 36.6 లక్షల మంది వినియోగదార్లు నిష్క్రమించారు. దీంతో జియో మొత్తం మొబైల్‌ కస్టమర్ల సంఖ్య 40.27 కోట్లకు వచ్చి చేరింది.

ఫిక్స్‌డ్‌ లైన్‌ చందాదార్లు క్రమంగా పెరుగుతున్నారు. వీరి సంఖ్య 2.42 కోట్ల నుంచి 2.45 కోట్లకు ఎగసింది. ప్రైవేటు కంపెనీలు కస్టమర్లను పెంచుకుంటుండగా ప్రభుత్వ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ వెనుకబడుతున్నాయి. ఈ విభాగంలో రిలయన్స్‌ జియో 2.44 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌ 91,243, వొడాఫోన్‌ ఐడియా 24,948, క్వాడ్రెంట్‌ 18,622, టాటా టెలీసర్వీసెస్‌ 3,772 కొత్త వినియోగదార్లను నమోదు చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంయుక్తంగా 70 వేల పైచిలుకు కస్టమర్లను దూరం చేసుకున్నాయి.

చదవండి: జియో అదిరిపోయే బంపరాఫర్‌, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్‌స్క్రిప్షన్!

    

మరిన్ని వార్తలు