Airtel Prices Hike News: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీషాక్‌!

19 May, 2022 18:26 IST|Sakshi

ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్‌ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్‌ సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఈ ఏడాది తదుపరి విడత టారిఫ్‌ల పెంపుతో తమ ఏఆర్‌పీయూ (యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ.200 మార్కును దాటగలదని టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. 

అయిదేళ్లలో దీన్ని రూ.300కు పెంచుకునే అవకాశం ఉందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఆయన చెప్పారు. గతేడాది మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.145తో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్‌లో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.178కి పెరిగింది. టెలికం సంస్థలు గత రెండేళ్లుగా మొబైల్‌ కాల్స్, డేటాల ధరలను పెంచుతున్నాయి.

ప్రైవేట్‌ రంగంలోని మూడు సంస్థలు గతేడాది నవంబర్‌–డిసెంబర్‌లో మొబైల్‌ ప్లాన్ల రేట్లను 18–25 శాతం మేర పెంచాయి. మరోవైపు, చిప్‌ల కొరతతో స్మార్ట్‌ఫోన్ల రేట్లు పెరిగి విక్రయాలపై ప్రభావం పడిందని విఠల్‌ చెప్పారు. ఇది తాత్కాలిక ధోరణే కాగలదని ఎండీ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు.

చదవండి👉ఎయిర్‌టెల్‌, జియో యూజర్లకు బంపరాఫర్‌!

మరిన్ని వార్తలు