చార్జీ పెంపు.. ఎయిర్‌టెల్‌ను ప్రశ్నించనున్న కేంద్రమంత్రి

26 Jan, 2023 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: డేటా వ్యయం, పరికరాల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. కనీస నెలవారీ చార్జీని ఎయిర్‌టెల్‌ 57 శాతం పెంచిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘డేటా ధరలు అధికం కావడం వేగవంతమైన డిజిటైజేషన్‌కు అవరోధాలు. 2025 నాటికి 120 కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌కు తీసకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం 83 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న డేటా వినియోగం లేదా పరికరాల ధరలో ఏదైనా పెరుగుదల వంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం.

ఎయిర్‌టెల్‌ ఇటీవల మొబైల్‌ సేవల ధరల పెంపుపై అధ్యయనం చేయలేదు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పరిశీలించే వరకు వేచి చూస్తాం.ట్రాయ్‌తో తప్పకుండా మాట్లాడబోతున్నాం. రష్యా–ఉక్రెయిన్‌ సమస్య కారణంగా ఇది స్వల్పకాలికమా? లేదా దీర్ఘకాలికమా? ఇది ట్రెండ్‌గా మారబోతుందా? ఇవీ మేం అడగబోయే ప్రశ్నలు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం పడింది. డేటా ధరల ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చార్జీలు పెంచడానికి కారణం ఏమిటని ఆపరేటర్‌ను ప్రశ్నిస్తాం. డేటా వ్యయాలు అందుబాటులో ఉండాలన్నదే మా ఆశయం’ అని ఆయన అన్నారు.

చదవండి: గూగుల్‌ నుంచి ఇది అసలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు!

మరిన్ని వార్తలు