‘డిజిగోల్డ్‌’ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌

14 May, 2021 09:32 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ‘‘డిజిగోల్డ్‌’’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. డిజిటల్‌ గోల్డ్‌ ప్రొవైడర్‌ సేఫ్‌గోల్డ్‌ భాగస్వామ్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో సేవింగ్స్‌ అకౌంట్‌ కలిగిన కస్టమర్లు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ఉపయోగించి డిజిగోల్డ్‌ ద్వారా 24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా కస్టమర్లు కొనుగోలు చేసిన బంగారాన్ని సేఫ్‌గోల్డ్‌ సంరక్షణలో భద్రపరుకోవచ్చు. 

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా కొన్ని క్లిక్‌లతో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇందుకు కనీస పెట్టుబడి నిబంధన లేదు. కస్టమర్లు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)ను త్వరలో యాప్‌లో ప్రవేశపెడతామని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఓఓ గణేశ్‌ అభిమన్యు తెలిపారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ పరిమితిని రూ.2 లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం రూ.1-2 లక్షల మధ్య డిపాజిట్లపై 6% వడ్డీని చెల్లిస్తోంది.

చదవండి:

పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్!

మరిన్ని వార్తలు