5జీ నెట్‌వర్క్‌: ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం..!

21 Jun, 2021 19:41 IST|Sakshi

న్యూ ఢిల్లీ: భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడానికి పలు కంపెనీలు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత్‌కు చెందిన దిగ్గజ మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు 5జీ టెక్నాలజీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. 5జీ టెక్నాలజీను మరింత వేగంగా విస్తరించడం కోసం  ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం కోసం దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌(టీసీఎస్‌)తో జతకట్టనుంది. 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ఇరు కంపెనీలు సంయుక్తంగా కలిసి పనిచేస్తాయని భారతి ఎయిర్‌టెల్‌ సోమవారం రోజున ఓ ప్రకటనలో తెలిపింది.  

టాటా గ్రూప్ ‘ఓ-రాన్‌- ఆధారిత రేడియో & ఎన్‌ఎస్‌ఎ / ఎస్‌ఎ కోర్‌’ ను అభివృద్ధి చేసింది. దీనిలో పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీను ఉపయోగించి ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ను మరింత వేగంగా అభివృద్ధి పరచనుంది. టీసీఎస్‌, ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో భారత్‌లో సాంకేతిక రంగాల్లో గణనీయమైన మార్పు తప్పకుండా వస్తుందని, అంతేకాకుండా భారత్‌లో వివిధ ఆవిష్కరణలకు మరింత ఊతం ఇస్తుందని భారతి ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్‌ విట్టల్‌ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఈ పరీక్షలో ఎయిర్‌టెల్‌ 1 జీబీపీఎస్‌ స్పీడ్‌ను అందుకుంది.

చదవండి: ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌.!

మరిన్ని వార్తలు