చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్‌టెల్

1 Sep, 2020 20:57 IST|Sakshi

సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఆకట్టుకునేందుకు, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా కొత్త మార్గాలతో వస్తోంది. తాజాగా లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర చిరుతిండి  ప్యాకెట్లు కొంటే ఉచితంగా డేటాను అందిస్తోంది. 10 రూపాయల ప్యాకెట్‌తో 1 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది

లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ డోరిటో ఇతర తినదగిన వస్తువుల ప్యాకెట్ కొనుగోలు చేసిన ప్రతిసారీ వారికి ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఈ ఉచిత ఇంటర్నెట్ డేటాను పొందాలంటే  ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్ కోసం వెతకాలి. ఆతరువాత ఈ కోడ్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి,ఆపై మైకూపన్‌ల విభాగంలో నమోదు చేయాలి. అంటే ఎయిర్‌టెల్ వినియోగదారులు చిప్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్యాకెట్ తో పాటు కూపన్‌ను తీసుకోవడం మర్చిపోకూడదు. 10 రూపాయల విలువైన చిప్స్ కొనుగోలు చేస్తే, ఒక జీబీ ఉచితం. అదే  20 రూపాయలు కొనుగోలు చేస్తే, 2 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అయితే  రీడీమ్ చేసిన తేదీ నుండి మూడు రోజులు మాత్రమే ఈ ఉచిత డేటా చెల్లుతుంది.

వినియోగదారులకు ఉత్తమ నెట్‌వర్క్ అనుభవాన్ని అందించేందుకు పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్  చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పోకడలను సరిపోలే  కొత్త వ్యూహాలను తాము అభివృద్ధి చేస్తామనీ, ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ తో భాగస్వామ్యం అని  పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్  కేటగిరీ హెడ్ ఫుడ్స్ దిలేన్ గాంధీ  తెలిపారు. వినియోగదారులు డిజిటల్ కంటెంట్  చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేస్తారన్నారు.

మరిన్ని వార్తలు