విదేశాలకు ఆకాశ ఎయిర్‌

2 Mar, 2023 04:28 IST|Sakshi

బెంగళూరు: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్‌ నాటికి పెద్ద ఎత్తున విమానాలకు ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో వినయ్‌ దూబే బుధవారం వెల్లడించారు. ‘ఇప్పటికే 72 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చాం. వీటిలో 18 సంస్థ ఖాతాలో చేరాయి. కొత్తగా ఇవ్వనున్న ఆర్డర్‌ మూడంకెల స్థాయిలో ఉంటుంది. ఏడాది కాలంలో 300 మంది పైలట్లను నియమించుకుంటాం.

బెంగళూరులో లెర్నింగ్‌ అకాడెమీ స్థాపించనున్నాం. వచ్చే పదేళ్లలో సంస్థకు కనీసం 3,500 మంది పైలట్లు అవసరం అవుతారు’ అని వివరించారు. సిబ్బందిలో మహిళల సంఖ్య 37 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది ఆకాశ ఎయిర్‌ లక్ష్యం. గతంలోనే ఆర్డర్‌ ఇచ్చిన 72 విమానాలను బోయింగ్‌ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న ఆకాశ ఎయిర్‌ 10 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాద్, వైజాగ్‌తోసహా 14 నగరాల్లో సేవలు అందిస్తోంది. 2023 ఆగస్ట్‌ నాటికి వారంలో 1,000 సర్వీసులు నడపాలని లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని వార్తలు