అలర్ట్: జూన్​ 30లోగా ఎఫ్​డీ దారులు ఈ ఫామ్​లు నింపాల్సిందే

24 May, 2021 18:41 IST|Sakshi

కరోనా మహమ్మరి నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించడానికి ప్రభుత్వం గడువును పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) వ్యక్తిగత ఐటీఆర్ కోసం 2 నెలలు, కంపెనీలు లేదా భాగస్వామ్య సంస్థలకు ఒక నెల గడువును పొడిగించింది. సీబీడీటీ  కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ఎఫ్‌డీ గడువు విషయంలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఎఫ్‌డీలో పెట్టుబడులు పెట్టిన వారు జూన్ 30 న లేదా అంతకన్నా ముందు 15 జీ, 15 హెచ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. 

ఈ ఫామ్​లను నింపి గడువులోగా బ్యాంకుల్లో సమర్పిస్తే డబ్బు ఆదా అవుతుంది. లేకపోతే బ్యాంకులు పన్ను మొత్తాన్ని కట్ చేస్తాయి. 15జీ, 15హెచ్‌ ఫామ్​ల వల్ల ఫిక్స్​డ్ డిపాజిట్ (ఎఫ్​డీ) ఉన్న వారికి ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్​(టీడీఎస్​) నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం మంచి వడ్డీ రేట్లు వస్తుండడంతో ఎక్కువ మంది మదుపరులు ఎఫ్​డీలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎఫ్​డీల ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ పరిధిని నిర్ణయించింది. అది దాటిన వారికి టీడీఎస్ వర్తిస్తోంది.

టీడీఎస్​పై గరిష్ట పరిమితి ఎంత..?
మొదట్లో టీడీఎస్​ పరిమితి రూ.10వేలు ఉండగా ప్రస్తుతం అది రూ.40వేలకు పెరిగింది. ఈ పరిమితి పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి వర్తిస్తుంది. ఆపై టీడీఎస్​ నుంచి మినహాయింపు పొందాలంటే.. 15G, 15H ఫామ్​లను సమర్పించాల్సి ఉంటుంది.

15 జీ ఫామ్ అంటే..?
మీరు పెట్టుబడి పెట్టిన నగదు ద్వారా వచ్చే వడ్డీపై టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15జీని సమర్పించాలి. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. దాని ఆధారంగా ఈ ఫారం నింపబడుతుంది. ఈ ఫారమ్‌ను ఎవరు పూరించవచ్చో తెలుసుకుందాం. ఒక భారతీయ పౌరుడు లేదా ఉమ్మడి హిందూ కుటుంబం లేదా ట్రస్ట్ ఈ ఫారమ్ నింపవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఫారమ్‌ను పూరించవచ్చు. ఈ ఫారం కంపెనీకి లేదా సంస్థకు వర్తించదు. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి. ఓ సంవత్సరంలో వడ్డీ రాబడి పన్ను మినహాయింపు పరిధిని దాటి ఉండకూడదు.

15 హెచ్ ఫామ్ అంటే..?
60 ఏళ్లు పైబడిన వారు టీడీఎస్ పన్ను మినహాయింపు కోసం ఫామ్ 15 హెచ్ ఫామ్ సమర్పించాలి. ఏ భారతీయ పౌరుడైనా ఈ ఫారమ్ నింపవచ్చు. వ్యక్తికి కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. మొత్తం రాబడిపై ట్యాక్స్ లియబులిటీ సున్నాగా ఉండాలి.

ఈ రెండు ఫామ్​ల్లో మీ ప్రాథమిక సమాచారాన్ని చాలా జాగ్రత్తగా నింపాలి. ఆ తర్వాత వీటికి పాన్​ కార్డ్​ కాపీని, ట్యాక్స్ డిక్లరేషన్​ను జత చేయాలి. ఆ తర్వాత ఫిక్స్​ డిపాజిట్ ఉన్న బ్యాంకులో సమర్పించాలి. ఈ రెండు ఫామ్​ల కాల పరిమితి ఓ సంవత్సరం ఉంటుంది.

చదవండి:

కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే

మరిన్ని వార్తలు