పేటీఎంలో ఆలీబాబా వాటాల విక్రయం

13 Jan, 2023 02:22 IST|Sakshi

న్యూఢిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో ఆలీబాబా సింగపూర్‌ ఈ–కామర్స్‌ దాదాపు 3 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 1,031 కోట్లు. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ డేటా ప్రకారం ఆలీబాబా సింగపూర్‌ ఈ–కామర్స్‌ 1.92 కోట్ల షేర్లను (సుమారు 2.95 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 536.95 రేటుకి విక్రయించింది. దీనితో వన్‌97లో ఆలీబాబా మొత్తం వాటాలు 31.14 శాతం నుంచి 28.19 శాతానికి తగ్గాయి. గురువారం పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించి రూ. 543.50 వద్ద ముగిశాయి.   

పేటీఎం రుణ వృద్ధి 4 రెట్లు
కాగా, డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్‌లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తెలిపింది. దీనితో డిసెంబర్‌ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్‌ క్యాపిటల్, పిరమల్‌ ఫైనాన్స్‌ వంటి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. 

మరిన్ని వార్తలు