భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా!

17 Nov, 2022 11:55 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక మాంద్యం ముప్పు ఉన్న నేపథ్యంలో ఇటీవల దిగ్గజ సంస్థలు సైతం భారీగా లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ కూడా తమ సిబ్బంది సంఖ్యను భారీగానే తొలగిస్తున్నట్లు ప్రకటించింది.


అయితే ఈ తొలగింపుల ప్రభావం ఇతర దేశాల కంటే భారత్‌లో ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు బిజినెస్‌ పత్రికలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ కూడా దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

అమెజాన్‌ ప్రభావం భారత్‌పై పడనుంది!
భారత్‌లో ఈ టెక్ దిగ్గజం ఇ-కామర్స్, వెబ్ సేవలు, వీడియో స్ట్రీమింగ్‌తో సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఎకానమిక్‌ టైమ్స్‌  నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్‌ (Facebook)తో పాటు పలు దిగ్గజ సంస్ధలు సైతం తమ సిబ్బందిని భారీగానే తగ్గించుకుంటున్నాయి. అయితే ఇతర సంస్థలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉండవచ్చుని పేర్కొంది. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలతో సహా, అమెజాన్ సంస్థకు భారతదేశంలో 1.1 మిలియన్లకు( 11 లక్షల సిబ్బంది) పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుత లేఆఫ్‌ల కారణంగా వారిపై ఈ ప్రభావం పడనుందని వెల్లడించింది.

ఈ తొలగింపులు ఇంజినీరింగ్‌తో సహా అనేక రంగాలలో జరిగినట్లు తెలుస్తోంది. భారత్‌లో కంపెనీకి బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోని కో-వర్కింగ్ స్పేస్‌ల నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉండగా.. మెటా గత వారం 11,000 ఉద్యోగాలను తగ్గించినట్లు ప్రకటించింది. ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ తమ సిబ్బందిని సగానికి తగ్గించింది.

చదవండి: ‘గూగుల్‌ పే.. ఈ యాప్‌ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!

మరిన్ని వార్తలు