అమెజాన్‌పై‌ ఆరోపణలు.. రంగంలోకి ఈడీ

29 Jan, 2021 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక చట్టం, దేశ నియమాలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. కొన్ని మల్టీ–బ్రాండ్స్‌కు సంబంధించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ కంపెనీలపై అవసరమైన చర్యలు కోరుతూ ఈడీకి ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు అందిన నేపథ్యంలో.. విదేశీ మారక నిర్వహణ చట్టంలోని (ఫెమా) వివిధ సెక్షన్ల కింద దర్యాప్తు జరుగుతోంది.

ఫ్యూచర్‌ రిటైల్‌ను నియంత్రించడానికి అమెరికాకు చెందిన అమెజాన్‌.. ఫ్యూచర్‌ రిటైల్‌ యొక్క అన్‌లిస్టెడ్‌ యూనిట్‌తో చేసుకున్న ఒప్పందాల ద్వారా చేసిన ప్రయత్నం ఫెమా మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఫెమా, ఎఫ్‌డీఐ నిబంధనలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ఉల్లంఘించాయంటూ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌కు (డీపీఐఐటీ) కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ఫిర్యాదు చేశాయి. 

మరిన్ని వార్తలు