American Express: ఆంక్షల ఎత్తివేత, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌  స్పందన

25 Aug, 2022 10:53 IST|Sakshi

ముంబై: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలను ఎత్తి వేయడంపై సంతోషం ప్రకటించింది. కొత్త దేశీయ కస్టమర్లను ఆన్‌బోర్డ్‌లో చేరేలా  తక్షణమే వీలు కల్పించడం తమకు గణనీయమైన  లాభాన్ని చేకూరుస్తుందని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌  తెలిపింది.

కీలకమార్కెట్‌లో పరిమితులను ఎత్తివేయడాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్వాగతించింది తమకు ఇండియా కీలకమైన వ్యూహాత్మక మార్కెట్‌ అనీ, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో తమ  స్థానిక  ప్రధాన పెట్టుబడుల ఫలితమే ఆర్బీఐ నిర్ణయమని సంస్థ తాత్కాలిక సీఈఓ, సీఓఓ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ప్రీమియం ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ తీర్చేందుకు అత్యుత్తమ సామర్థ్యంతో ఉన్నామనీ, ఆర్బీఐ నిర్ణయం దేశంలో తమ వ్యాపార వృద్ధికి తోడ్పడు తుందన్నారు.

కాగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌పై ఆంక్షలను ఆర్బీఐ బుధవారం ఎత్తివేసింది. కొత్తగా దేశీయ కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతించింది. చెల్లింపుల సమాచారాన్ని నిక్షిప్తం చేసే అంశానికి సంబంధించిన ఆదేశాలను పాటించనందుకు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఆర్‌బీఐ గతంలో ఆంక్షలు విధించింది. పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు చెల్లింపుల పూర్తి సమాచారాన్ని 2018 ఏప్రిల్‌ నుంచి భారత్‌లోనే నిక్షిప్తం చేయాలన్న నిబంధన ఉంది.  

మరిన్ని వార్తలు