కరోనాకి బెదరని లంబోర్గిని

20 Jun, 2021 15:00 IST|Sakshi

గతేడాది కంటే రెట్టింపు అమ్మకాలు

లగ్జరీ కార్లపై కనిపించని కరోనా అమ్మకాలు

బైకుల అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్‌ 

కరోనా సెకండ్‌ వేవ్‌ ఇండియా మొత్తాన్ని చుట్టేసింది, దాదాపుగా అన్ని రంగాలు కోవిడ్‌ ఎఫెక్ట్‌కి లోనయ్యాయి. కరోనా వైరస్‌ ధాటికి నూటికి తొంభైశాతం అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే లగ్జరీ కార్ల బ​‍్రాండ్‌ లంబోర్గిని మాత్రం కరోనాకు సవాల్‌ విసిరింది. కరోనా సంక్షోభ సమయంలోనూ రికార్డు స్థాయి అమ్మకాలు సాగించింది.

అంచనాలు తారుమారు
జర్మనీకి చెందిన లంబోర్గిని బ్రాండ్‌కి అంతర్జాతీయంగా మంచి ఫేమ్‌ ఉంది. ఈ బ్రాండ్‌ కార్లను ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో బాగా సేల్‌ అవుతోన్న లంబోర్గిని ఉరుస్‌ కారు షోరూమ్‌ ధరనే రూ. 3.43 కోట్లుగా ఉంది. దీంతో లగ్జరీ బ్రాండ్‌ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే అంచనాలు ఉండేవి. అయితే అవి పటాపంచలయ్యాయి.

రెట్టింపు అమ్మకాలు
ధర ఎంతున్నా పర్వాలేదు మాకు లంబోర్గిని ఉరుస్‌ కావాలంటున్నారు సినీ సెలబ్రిటీలు, బిజెనెస్‌మెన్‌లు. దీంతో అమ్మకాల్లో లంబోర్గిని ఉరుస్‌ దూసుకుపోతుంది. గతేడాది కూడా కరోనా ఎఫెక్ట్‌లో దేశవ్యాప్తంగా కేవలం 13 లంబోర్గిని ఉరుస్‌ మోడళ్లు ఇండియాలో అమ్ముడు పోయాయి. కానీ ఈసారి కేవలం ఆరు నెలల కాలంలోనే 26 కార్లు ఇండియాలో డెలివరీ చేసింది లంబోర్గిని. కరోనా కల్లోలం, మందగించిన ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలేవి లంబోర్గినిపై ప్రభావం చూపలేదు. 

లగ్జరీ సెగ్మెంట్‌లో
ఒక్క లంబోర్గినే కాదు మెర్సిడెస్‌, ఆడి వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లలో కూడా కార్ల అమ్మకాలు సూపర్‌గా ఉన్నాయి. ఇటీవల విడుదలై మెర్సిడెస్‌ మేహ్‌బ్యాక్‌ జీఎల్‌ఎస్‌ 400 మోడల్‌ కార్లు విడుదలకు ముందే దాదాపు స్టాక్‌ మొత్తం అమ్ముడైపోయింది. ఇండియాలో తమ లగ్జరీ బ్రాండ్‌ కార్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని, త్వరలో మరిన్ని మోడళ్లు ఇండియాలో ప్రవేశపెడతామని మెర్సిడెస్‌ సీఈవో మార్టిన్‌ చెబుతున్నారు. ఇండియన్‌ మార్కెట్‌లో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆడి ఏకంగా ఈ ట్రాన్‌ పేరుతో లగ్జరీ ఈవీ ని అందుబాటులోకి తెచ్చింది. మరో హై ఎండ్‌ బ్రాండ్‌ పోర్షే కార్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో 57 శాతం పెరిగాయి.

బైకుల పరిస్థితి దారుణం
బిజినెస్‌ టైకూన్లు, టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, సినీ సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటే .. కరోనా ఎఫెక్ట్‌తో స్వంత టూవీలర్‌ కొనుక్కోవాలనుకున్న సామాన్యులు వెనుకడుగు వేస్తున్నారు. ఏళ్ల తరబడి పొదుపు చేసిన సొమ్మును ఖర్చు పెట్టేందుకు ధైర్యం చేయట్లేదు. దీంతో ఈ ఏడాది బైకుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఫెడరేషన్‌  ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ లెక్కల ప్రకారం కరోనాకు ముందు 2019 మేతో పోల్చితే 2021 మేలో బైకుల అమ్మకాలు ఏకంగా 71 శాతం పడిపోయాయి. 

చదవండి : స్టైలిష్‌ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'

మరిన్ని వార్తలు