శ్రీమతి కోరిక : టెర్రస్ ఎక్కిన స్కార్పియో

31 Oct, 2020 14:59 IST|Sakshi

సాక్షి,ముంబై: పాత వస్తువులను పారేయడమంటే చాలా మందికి  చెప్పలేని బాధ. దాన్ని ప్రేమగా మరోదాని కోసం వినియోగించడం తరచూ చూస్తూనే ఉంటాం. అందులోనూ ఫస్ట్ బైక్, మొదటి కారు అంటే మరీ పిచ్చి. ఒక్క పట్టాన వదిలిపెట్టాలనిపించదు. అలాంటివస్తువులను మరింత ఇన్నోవేటివ్‌గా వాడుతూ వాటిమీద తమకున్న ప్రేమనుచాటుకుంటారు చాలామంది. బిహార్‌‌కు చెందిన ఇంతసార్ ఆలం ఆ కోవకే చెందుతారు. అయితే ఆలం ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచించారు. తనకెంతో ఇష్టమైన స్కార్పియో  కారుపై ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నారు. అందుకే మహీంద్రా గ్రూప్ అధిపతిని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 

వివరాల్లోకి వెళ్లితే ఆలం తన మొదటి కారు స్కార్పియో ఆకారలో తన ఇంటి టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. అంతేకాదు దానికి ఒక నెంబరు ప్లేట్ కూడా జతచేశారు. మరో విషయం ఏమిటంటే స్కార్పియో వాటర్ ట్యాంక్ స్థాపించడం వెనుకఉన్న ఆలోచన ఇంతసార్ భార్యదట. ఆమె ఆగ్రాలో ఇలాంటిదే చూసి, అలాంటిదే కావాలని తన భర్తకు చెప్పిందట. దీంతో తన ఫస్ట్ లవ్.. ఇటు భార్య కోరిక ఎలా కాదనగలడు. అందుకే సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేసి స్కార్పియో వాటర్ ట్యాంక్ అలా టెర్రస్ ఎక్కించేశారన్నమాట అదీ సంగతి. ఈ స్కార్పియో వాటర్ ట్యాంకు ఇపుడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన ఆనంద్ మహీంద్ర తమ స్కార్పియో అంత ఎత్తుకు చేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. స్కార్పియో కారు పట్ల ఆలం అభిమానానికి, ప్రేమకు తన  సలామ్‌లు అంటూ ప్రశంసలు కురిపించారు.  

మరిన్ని వార్తలు