ఎంతో టాలెంట్‌ ఉంది.. కానీ ఏం లాభం.. చూస్తే బాధేస్తోంది!

29 Mar, 2022 13:14 IST|Sakshi

ఆనంద్‌ మహీంద్రా మరోసారి ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చకు తెర లేపారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. అందులో సైకిల్‌ నడిపే వ్యక్తి హ్యాండిల్స్‌ వదిలేసి తలపై బరువైన మూట పెట్టుకుని ఎంతో సునాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ వీడియో చూసిన ఆనంద్‌ మహీంద్రా బరువెక్కిన హృదయంలో తన స్పందన తెలిపారు.

ట్విట్టర్‌లో ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ ఈ వ్యక్తి ఓ హ్యుమన్‌ సెగ్వేలా ఉన్నాడు. జైరోస్కోప్‌ అతడి వంటిలోనే ఉన్నట్టుగా బ్యాలెన్స్‌ చేస్తున్నాడు. బ్యాలెన్స్‌ చేయడంలో అతడికి ఉన్న సెన్స్‌ నమ్మశక్యం కానిదిగా ఉంది. అయితే ఈ వీడియో చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. ఇండియాలో టాలెంట్‌ కలిగిన వారెందరో ఉన్నారు. వీరంతా మంచి జిమ్నాస్టులుగా స్పోర్ట్స్‌ పర్సన్స్‌గా మారాల్సిన వాళ్లు. కానీ వీళ్లు వెలుగులోకి రాలేక శిక్షణ పొందలేకపోతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో ఆకట్టుకునేలా ఉండటం దానిపై ఆనంద్ మహీంద్రా స్పందన మన దేశంలోని పరిస్థితికి అద్దం పట్టేలా ఉండటంతో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి మట్టిలో మాణిక్యాలకి సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తుండగా మరికొందరు ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు