హైదరాబాద్‌లో మరో మెడికల్‌ కాలేజీ? ఆనంద్‌ మహీంద్రా సంచలన ప్రకటన

3 Mar, 2022 14:32 IST|Sakshi

ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ స్థాపనకు నడుం బిగించారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులకు సూచనలు చేశారు. ఈ విషయాన్ని నేరుగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు ఆనంద్‌ మహీంద్రా.

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భారత్‌ కలవరపాటుకు గురవుతోంది. వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతుండటంతో.. వారిని తరలించేందుకు ఆపరేషన్‌ గంగను ప్రభుత్వం చేపట్టింది. ఐనప్పటికీ నవీన్‌ అనే విద్యార్థి బాంబు దాడిలో చనిపోయాడు. మరో పంజాబ్‌ విద్యార్థి అనారోగ్య కారణాలతో ఆస్పత్రితో తుది శ్వాస విడిచాడు.

ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్‌ మెడికల్‌ విద్యార్థుల కష్టాల నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలతో జాతీయ మీడియా కథనం ప్రచురించింది. ఇందులో చైనా, రష్యా, ఉక్రెయిన్‌ మొదలు అమెరికా వరకు అనేక దేశాల్లో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ వివరాలు చదివిన ఆనంద్‌మహీంద్ర కలవరం చెందారు.

మన దగ్గర మెడికల్‌ కాలేజీల కొరత ఉందా ? ఎందుకు ఇంత మంది విద్యార్థులు మెడిసన్‌ చదివేందకు బయటి దేశాలకు వెళ్తున్నారు. ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించేందుకు మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశం ఉందా? ఈ వివరాలు పరిశీలించాంటూ టెక్‌ మహీంద్రా చీఫ్‌ సీపీ గుర్నానిని ఆదేశించారు ఆనంద్‌మహీంద్రా.

మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉంది. జీడిమెట్లలో సువిశాల ప్రాంగణంలో ఈ క్యాంపస్‌ విస్తరించి ఉంది. ఆనంద్‌ మహీంద్రా ఆలోచన కార్యరూపం దాల్చితే హైదరాబాద్‌ క్యాంపస్‌లో మెడికల్‌కాలేజీ వచ్చే ఆస్కారం ఉంది.
 

మరిన్ని వార్తలు