World First Beach: శాస్త్రవేత్తల మాట.. భూమండలంపై తొలి బీచ్‌.. ఎక్కడంటే

24 Nov, 2021 12:44 IST|Sakshi

Anand Mahindra: సోషల్‌ మీడియా వేదికగా వింతలు విశేషాలను పంచుకునే ఆనంద్‌ మహీంద్రా ఈసారి మరో కొత్త విషయంతో మన ముందుకు వచ్చారు. ఆ ప్రదేశం విశేషాలను చెబుతూనే తనలోని వ్యాపారిని తెర మీదకు తీసుకుచ్చారు. ఆ ప్రదేశాన్ని ఎలా అభివృద్ధి చేయోచ్చనే విషయాన్ని తెలిపారు.

భూమండలంపై తొలి బీచ్‌ 
ఇటీవల ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన అనేక పరిశోధనల తర్వాత ఈ భూమండలం మొత్తం మీద తొలిసారిగా బీచ్‌గా మారిన ప్రాంతాన్ని కనుగొన్నామని ప్రకటించారు. ఈ ప్రదేశం ఇండియాలోని ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఉన్న సింఘ్‌భూమ్‌ ప్రాంతంగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఒకప్పుడు భూమండలం అంతా సముద్రం వ్యాపించి ఉండేంది. ఆ తర్వాత కాలక్రమేనా టెక్టానిక్‌ ప్లేట్లలో కదలికలు, భూఅంతర్భాగంలో పేలుడు తదితర చర్యల కారణంగా సముద్రం ఉపరితలం మీదకు తొలిసారిగా బయటకు వచ్చిన ప్రదేశంగా ఝార్ఖండ్‌ రాష్ట్రంలో సింఘ్‌భూమ్‌ని పేర్కొన్నారు. ఈ చర్య 3.2 బిలియన్‌ ఏళ్ల కిందట జరిగిందని అంటున్నారు. ఓ రకంగా భూమిపై తొలి బీచ్‌గా ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఉన్నట్టుగా తేల్చారు. అయితే ప్రస్తుతం ఝార్ఖండ్‌ ల్యాండ్‌ లాక్డ్‌ స్టేట్‌గా ఉంది. ఓ రకంగా భూగోళంపై జరిగిన అద్భుత ఘట్టాలకు నేటికి సింఘ్‌భూమ్‌ మౌన సాక్షిగా నిలిచి ఉంది.

ఏకోటూరిజం
సింఘ్‌భూమ్‌కి సంబంధించిన విశేషాలు ఇటీవల ఓ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలను ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘ ఈ ప్రదేశాన్ని టూరిస్టులను ఆకర్షించే ఆయస్కాంతంలాగా మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచలోనే తొలి బీచ్‌ దగ్గరికి వెళ్లాలనే గోల్‌ లేని వారిని కూడా ఇక్కడికి రప్పించవచ్చు. స్థానికంగా ఉన్న గిరిజనుల సంస్కృతి జీవితాలకు ఇబ​‍్బంది రాకుండా ఏకోటూరిజంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయవచ్చు అని పేర్కొంటూ ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలను ట్యాగ్‌ చేశారు. 

చదవండి: మీరు బాగుండాలయ్యా.. ఆనంద్‌ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా

మరిన్ని వార్తలు