Gold News: బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో

7 Sep, 2021 12:37 IST|Sakshi

Buying Gold On PhonePe: కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌ పెరిగాయి. టీ బిల్లు దగ్గరి నుంచి ఇంటి రెంట్‌ వరకు అంతా యూపీఐ పేమెంట్స్‌లోనే చేయడానికి జనం అలవాటు పడిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విలువైన బంగారాన్ని సైతం ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు జోరు మీదున్నారు.

ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు
పెళ్లిలు, పేరంటాలకే కాదు పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేయడం మన దగ్గర ఆనవాయితీ. దేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే రాష్ట్రంగా కేరళ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పటికీ కేరళలో బంగారం కొనుగోలు విషయంలో పాత పద్దతినే అనుసరిస్తున్నారు. వ్యాపారుల వద్దకే వెళ్లి స్వయంగా పరిశీలించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చే సరికి ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలుకు ఓకే అనేస్తున్నారు. ఇటీవల ఫోన్‌ పే సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ్యాప్తంగా ఫోన్‌పే యాప్‌ ద్వారా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటికంటే ముందు మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఫోన్‌పే యాప్‌ ద్వారా 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారు.

 

తెలంగాణ నంబర్‌ 1
ఫోన్‌పేకు తెలంగాణ ప్రజలు జై కొడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇతర యాప్‌ల కంటే ఫోన్‌పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పే తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌క‌్షన్స్‌కి సంబంధించి యూనైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఏ) ఆధారంగా అనేక యాప్స్‌ సేవలు అందిస్తున్నాయి. అయితే  తెలంగాణలో జరుగుతున్న ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక‌్షన్స్‌లో 42 శాతం తమ యాప్‌ ద్వారానే జరుగుతున్నాయని ఫోన్‌ పే వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవా 36 శాతం, హర్యానాలో 35 శాతం ఫోన్‌పే ద్వారానే ట్రన్సాక‌్షన్స్‌ జరుగుతున్నట్టు వెల్లడించింది. 
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ
వినియోగదారుల సంఖ్యకు సంబంధించి ఫోన్‌పేను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నాటక తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఫోన్‌పే యాప్‌ వినియోగం ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఫోన్‌ పే కస్టమర్ల సంఖ్య వంద శాతం పెరగగా లావాదేవీల సంఖ్య 150 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది.


టైర్‌ టూ సిటీల్లోనే
ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌కి సంబంధించి టైర్‌ 1 సిటీల్లో ఎక్కువగా వ్యాపార సంబంధమైన లావాదేలు జరుగుతున్నాయి. అదే టైర్‌ 3 సిటీస్‌కి వచ్చే సరికి వ్యాపార లావాదేవీల కంటే ఇంటి రెంటు, హోటల్‌ బిల్లు ఇలా వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధించి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. టైర్‌ 3 సిటీస్‌లో వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ఆర్థిక లావాదేవీల వాటా 49 శాతానికి చేరుకోగా వ్యాపార సంబంధమైన లావాదేవీలు 32 శాతానికి పరిమితమయ్యాయి. అదే టైర్‌ 1 విషయానికి వస్తే ఇక్కడ వ్యాపార లావాదేవీల వాటా 52 శాతంగా నమోదు అయ్యింది. ఇక్కడ వ్యక్తుల నుంచి వ్యక్తులకు 36 శాతం, రీఛార్జీలు, కరెంటు బిల్లులు చెల్లింపులు 11 శాతంగా నమోదు అయ్యాయి.  


పెరిగిన లావాదేవీలు
ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో చేయడం మొదలైంది. అయితే 2020 మార్చిలో కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరిగింది. 2020 మార్చికి ముందు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో జరిగే ఆర్థిక లావాదేవీ విలువ ప్రతీరోజు సగటు 2 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది 6 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్లలో రాని మార్పు కేవలం 18 నెలల్లోనే మూడింతలు అయ్యింది.  
చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

మరిన్ని వార్తలు