న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తాజాగా రెండు గ్రూప్ సంస్థల నుంచి వైదొలగారు. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. సెబీ ఆదేశాలమేరకు అనిల్ తప్పుకున్నారు. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ అనిల్ పదవులు నిర్వహించకుండా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ డి.అంబానీ బోర్డు నుంచి వైదొలగినట్లు రిలయన్స్ పవర్ తాజాగా బీఎస్ఈకి వెల్లడించింది.
రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. కంపెనీ నుంచి నిధులను అక్రమంగా తరలించిన ఆరోపణలతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్తోపాటు.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ ఈ ఫిబ్రవరిలో నిషేధించింది. అంతేకాకుండా ఈ నలుగురినీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలు, లిస్టెడ్ కంపెనీలు, పబ్లిక్ నుంచి నిధులు సమీకరించే కంపెనీలు తదితరాలలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా సెబీ నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేసింది.