మిగిలిన బకాయిలు కూడా విడుదల చేయాలి : బుగ్గన 

12 Oct, 2020 20:59 IST|Sakshi
ఫైల్ ఫోటో

ఐజీఎస్టీ  బకాయిలలో కొంత విడుదల 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు: బుగ్గన రాజేంద్రనాథ్

సాక్షి, అమరావతి : 2020-21 సంవత్సరంలో రావాల్సిన కాంపెన్సేషన్ బకాయిలను కొంత మేరకు విడుదల చేసినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన ఐజీఎస్టీ బకాయిలు కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సోమవారం (అక్టోబరు12న ) 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (వర్చువల్ సమావేశం) ఢిల్లీ నుంచి జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  బుగ్గన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంచే విధించి వసూలు చేయబడుతున్న సెస్సులు, సర్ ఛార్జీలు, డివిజబుల్ పూల్ లేనందువల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గి ప్రభావం పడుతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు పట్ల కేంద్రంగా ఉదారంగా వ్యవహరించాలని కోరారు. కౌన్సిల్ సమావేశంలో ప్రాముఖ్యత ఉన్న అంశాలను అంగీకారం తెలుపుతూ, వాటికి సరైన విధాన రూపకల్పన చేయాలని సూచించారు. కాంపెన్సేషన్ విషయంలో ఏకాభిప్రాయం కొరకు మరిన్ని సమావేశాలు, లోతైన అధ్యయనం జరగాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులతో పాటు ప్రస్తుతం కొవిడ్ వల్ల ప్రజారోగ్యం మీద అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుండడంతో రాష్ట్రాల వనరులపై అదనపు భారం పడుతోందని చెబుతూ, ప్రస్తుత క్లిష్ట సమయంలో కేంద్రం వెంటనే అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు