బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020: ఏపీకి టాప్‌ ప్లేస్‌ 

30 Jun, 2022 12:58 IST|Sakshi

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో ఏపీ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. గురువారం టాప్‌ అచివర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించారు.

కాగా, ఈ లిస్టులో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్‌ అచివర్స్‌లో ఏపీతో పాటు గుజరాత్‌, హర్యానా, కర్నాటక, పంజాబ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద‍్ర ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులను ఇచ్చింది. ఇక, అచివర్స్‌ లిస్టులో హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప‍్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్‌ లిస్టులో అసోం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, జార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. మరోవైపు.. ఎమర్జింగ్​ బిజినెస్​ ఎకోసిస్టమ్స్​ విభాగంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. వీటిలో ఢిల్లీ, పుదిచ్చేరి, త్రిపుర ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి. 

అయితే, గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్‌ ప్రక్రియ జరిగింది. 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్‌ హోల్డర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర‍్ణయాలపై సానుకూలత వ్యక్తమైంది. 

1. ఆంధ్రప్రదేశ్‌- 97.89 శాతం స్కోర్‌
2. గుజరాత్‌- 97.77 శాతం
3. తమిళనాడు- 96.97 శాతం
4. తెలంగాణ- 94.86 శాతం

ఇది కూడా చదవండి:  ‘చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమం అందించారు’

మరిన్ని వార్తలు