పబ్లిక్‌ ఇష్యూకి ఫార్మ్‌ఈజీ

11 Nov, 2021 06:02 IST|Sakshi

రూ. 6,250 కోట్ల సమీకరణ

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: ఫార్మసీ ప్లాట్‌ఫాం ఫార్మ్‌ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌ తాజాగా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా రూ. 6,250 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం ముసాయిదా ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలోనే ఉంటుందని, ప్రస్తుత వాటాదారులెవరూ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లు విక్రయించడం లేదని సంస్థ తెలిపింది.

సుమారు రూ. 1,250 కోట్లకు ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్‌ కింద షేర్లు కేటాయిస్తే.. ఇష్యూ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని రూ. 1,929 కోట్ల రుణభారాన్ని తిరిగి చెల్లించేందుకు, వ్యాపార వృద్ధికి రూ. 1,259 కోట్లు, ఇతరత్రా అవసరాలకు రూ. 1,500 కోట్లు వినియోగించనున్నట్లు ఫార్మ్‌ఈజీ పేర్కొంది. జొమాటో, నైకా, పాలసీబజార్‌ తదితర ఐపీవోలు విజయవంతమైన నేపథ్యంలో ఫార్మ్‌ఈజీ కూడా పబ్లిక్‌ ఇష్యూకి వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఏపీఐ హోల్డింగ్స్‌ సంస్థ టెలీకన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ టెస్టులు వంటి సర్వీసులు కూడా అందిస్తుంది.

మరిన్ని వార్తలు