భారత్‌లో భారీ పెట్టుబడులు ఇందుకే: సీక్రెట్‌ రివీల్‌ చేసిన యాపిల్‌ సీఈఓ

3 Feb, 2023 13:40 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ మార్కెట్‌పై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ చెప్పారు. భారత్‌ మార్కెట్‌ తమకు అత్యంత కీలకమని, అందుకే ఇక్కడ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. యాపిల్‌ సంస్థ తమ డిసెంబర్‌  త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించింది. మొత్తం 117.2 బిలియన్‌ డాలర్లు (రూ.9,61,775 కోట్లు) రెవెన్యూ ఆర్జించినట్లు తెలిపింది. మార్కెట్ల సంఖ్య పరంగా ఇది ఆల్‌టైమ్‌ రికార్డ్‌. కెనడా, ఇండోనేషియా, మెక్సికో, స్పెయిన్‌, టర్కీ, వియత్నాం, బ్రెజిల్‌, భారత్‌ మార్కెట్ల నుంచి ఈ రెవెన్యూ వచ్చింది.

భారత్‌లో  యాపిల్‌ డబుల్‌ గ్రోత్‌
భారత్‌లో యాపిల్‌ సంస్థ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తోందని, దీనిపై చాలా సంతృప్తికంగా ఉన్నట్లు టిమ్‌కుక్‌ పేర్కొన్నారు. భారత్‌లో కంపెనీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగా 2020లో ఇక్కడ ఆన్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు. కోవిడ్‌  సంక్షోభం తర్వాత భారత్‌లో తమకు బాగా కలిసివచ్చిందన్నారు. 

మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం.. 2022లో భారత్‌లో రూ.30వేలుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో యాపిల్‌ వాటా 11 శాతం. ఇది మార్కెట్‌ రెవెన్యూలో 35 శాతం. భారత్‌లో గతేడాది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో యాపిల్‌దే అగ్రస్థానం. ఇందులో ఐఫోన్‌13 అత్యధికంగా అ‍మ్ముడుపోయిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. భారత్‌లో ఓవరాల్‌ స్మార్ట్‌ఫోన్‌  రెవెన్యూ షేర్‌లో 2021లో నాలుగో స్థానంలో ఉన్న యాపిల్‌.. 2022లో రెండో స్థానానికి ఎగబాకింది.

మరిన్ని వార్తలు