కంపెనీల మొండిపట్టు.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్న ఎంప్లాయిస్‌!

19 Jul, 2021 13:07 IST|Sakshi

కరోనా కారణంగా ఉద్యోగుల్లో చాలామంది వర్క్‌ ఫ్రమ్‌ హోంకే ఫిక్స్‌ అయిపోయారు. అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పుంజుకుంటున్న తరుణంలో తిరిగి ఆఫీస్‌ గేట్లు తెరవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి.  
 
ఈ మేరకు ఇంటర్నెట్‌ దిగ్గజ కంపెనీలు యాపిల్‌, గూగుల్‌ ఎంప్లాయిస్‌ తమ ఉద్యోగులకు ఆఫీస్‌లకు సిద్ధం కావాలని మెయిల్స్‌ పెడుతుండగా.. ప్రతిగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. తాము వర్క్‌ ఫ్రమ్‌ హోంలోనే కొనసాగుతామని, ఆఫీస్‌లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు చేస్తామని చాలామంది బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు.

యాపిల్‌కు లేఖలు
జూన్‌ నెలలో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రతిపాదన మేరకు ‘హైబ్రిడ్‌ మోడల్‌’ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే తాము ఆఫీస్‌లకు రాలేమని, వర్క్‌ ఫ్రమ్‌ హోం కొనసాగించాలని కొందరు ఎంప్లాయిస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తుండడంతో యాపిల్‌ కుదరదని తేల్చి చెప్పింది.

అయితే ఆఫీస్‌లకు రావాలని బలవంతం చేస్తే.. రిజైన్‌ చేస్తామని ఉద్యోగులు తాజాగా లేఖలు రాయడం మొదలుపెట్టారు. మరోవైపు కిందటి నెలలో యాపిల్‌ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం ఉద్యోగులు తాము తమకు వీలున్న రీతిలోనే పనులు చేస్తామని వెల్లడించడం విశేషం. ఈ నేపథ్యంలో కొందరు మేనేజ్‌మెంట్‌కు మళ్లీ లేఖలు రాయాలని భావిస్తుండగా.. కోర్టుకు వెళ్లే ఉద్దేశంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్‌ పునరాలోచన చేస్తుందా? లేదా? అనేది చూడాలి. 

గూగుల్‌ కూడా..
ఆఫీస్‌ రిటర్న్‌ పాలసీపై గూగుల్‌ ఉద్యోగుల్లోనూ అసంతృప్తే నెలకొంది. మే నెలలో కంపెనీ సీఈవో సుందర్‌పిచాయ్‌ ‘హైబ్రిడ్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌’ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మరో 20 శాతం మంది రిమోట్‌ వర్క్‌, ఇంకో 20 శాతం మంది రీ లోకేట్‌ కావాలని పిచాయ్‌ పిలుపు ఇచ్చాడు. ఇక లొకేషన్‌ టూల్‌ ఆధారంగా జీతాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ఈ దశలో గందరగోళానికి గురవుతున్న ఉద్యోగులు.. ఆఫీస్‌లకు రాలేమని చెప్తున్నారు. అంతేకాదు మెయిల్స్‌ ద్వారా తమ ఫ్రస్టేషన్‌ను వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరిన్ని వార్తలు