Apple Satellite Internet: సిమ్‌కార్డ్‌, నెట్‌వర్క్‌లతో పని లేదు

30 Aug, 2021 12:58 IST|Sakshi

టెక్నాలజీ వరల్డ్‌లో అనేక నూతన ఆవిష్కరణలకు కేరాప్‌ అడ్రస్‌గా యాపిల్‌ నిలిచింది.  ఏదైనా ఫీచర్‌ని యాపిల్‌ అందుబాటులోకి తెచ్చిందంటే మిగిలిన కంపెనీలన్నీ ఆ బాటలోనే నడుస్తాయి. మెటల్‌ బాడీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, టాప్‌నాచ్‌ ఒకటేమిటి ఇప్పుడు పాపులర్‌ ఫీచర్లలో సగానికి పైగా యాపిల్‌ వల్లే ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటిని మించి మరో పాత్‌ బ్రేకింగ్‌ ఫీచర్‌ని యాపిల్‌ అందుబాటులోకి తేనుందని మార్కెట్‌ వర్కాలు అంటున్నాయి. 

లియోతో మార్పులు
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు అన్నీ కూడా నెట్‌వర్క్‌ ఆధారంగా పని చేస్తున్నాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్‌టీఈ (లాంగ్‌టర్మ్‌ ఎవల్యూషన్‌),  5జీ వరకు వచ్చాం. శాటిలైట్‌ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఈ నెట్‌వర్క్‌లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్‌ ద్వారానే ఇటు కాల్స్‌, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్‌ కొనసాగించవచ్చు. 

ఐఫోన్‌ 13తో మొదలు ?
లియో టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకునేందుకు యాపిల్‌ అడుగులు వేస్తోంది.  త్వరలో రిలీజ్‌ చేయబోతున్న యాపిల్‌ 13 మోడల్‌ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మొబైల్‌ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్‌ ధరలోనే అ‍అన్నీ పొందు పరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి యాపిల్‌ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

లియో అంటే
నెట్‌వర్క్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై వాటితో సంబంధం లేకుండా భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్లను మొబైల్‌ కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించుకోబోతున్నారు. దీని కోసం లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను ‍ ప్రయోగించేందుకు బడా సంస్థలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆమెజాన్‌, ఎయిర్‌టెల్‌ , స్పేస్‌ఎక్స్‌,, టాటా, టెలిశాట్‌ వంటి కంపెనీలు ఈ పనిలో బిజీగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ 90వ దశకం నుంచి అందుబాటులో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా అనుమతులు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం తరఫున భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సైతం ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది.
చదవండి: సెల్‌ఫోన్‌ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..!

మరిన్ని వార్తలు