యాపిల్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ విడుదలకు భారత్‌లో బ్రేకులు? అభ్యంతరాలేంటంటే..

31 Aug, 2022 16:37 IST|Sakshi

యాపిల్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌ విడుదలపై వినియోగదారులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఆసక్తిని రెట్టింపు చేస‍్తూ యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 14 సిరీస్‌ను విడుదల తేదీ, ఫోన్‌లోని ఫీచర్లను లీక్‌ చేస్తుంది. ఈ తరుణంలో దేశీయ ఐఫోన్‌ లవర్స్‌ను నిరుత్సాహా పరుస‍్తూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

యాపిల్‌ ముందస్తు ప్రకటించిన తేదీలలో 'ఐఫోన్‌ 14 ప్రో' ను భారత్‌లో విడుదల చేసేందుకు అడ్డంకులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 14 సిరీస్ ఫోన్‌లను కొత్త ఫీచర్లను జోడిస్తూ అప్ గ్రేడ్‌ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 మ్యాక్స్‌ను మినహాయి ఇచ్చి..ఐఫోన్‌ 14 ప్రోలో మాత్రమే శాటిలైట్ కాలింగ్, టెక్స్టింగ్ ఫీచర్లను యాడ్‌ చేయనుంది. అదే జరిగితే ఐఫోన్‌ 14 ప్రో భారత్‌లో విడుదలలో జాప్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ శాటిలైట్‌ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ‍్యంతరం వ్యక్తం చేస‍్తోంది. ఎందుకంటే?

యాపిల్‌ నుంచి తొలిసారి  
మరో వారం రోజుల్లో విడుదల కానున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌లను భారీ మార్పులతో మార్కెట్‌కి పరిచయం చేయనుంది. ముఖ్యంగా డిజైన్‌ల విషయంలో యాపిల్‌ సంస్థ రాజీపడడం లేదని, యూజర్లను అట్రాక్ట్‌ చేసేలా వైడ్‌ నాచ్‌, పిల్‌ షేప్డ్‌ డిజైన్, మొబైల్‌ స్క్రీన్‌ స్పేస్‌ మరింత పెద్దగా ఉండేలా చూస్తోంది. ఆ సంస్థ తొలిసారి ఐఫోన్‌ 14లో నెట్‌ వర్క్‌ లేకపోయినా యూజర్లు అత్యవసర పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్‌ షేర్‌ చేసుకునేలా ఈ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఫీచర్‌పై పని చేస్తోంది.       

ఐఫోన్ 14 ప్రో శాటిలైట్ కనెక్టివిటీ
ఐఫోన్ 14 ప్రోలో వస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ గురించి యాపిల్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆ ఫీచర్‌ ఉంటే ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ భారత్‌లో విడుదల కాకపోవచ్చు. పైగా యాపిల్‌ సంస్థ మరిన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. భారత వైర్ లెస్ చట్టంలోని సెక్షన్ 6, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం దేశంలో తురయా/ఇరిడియం శాటిలైట్ ఫోన్ల వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో అనుమతి లేకుండా భారతదేశంలో శాటిలైట్ ఫోన్‌లను ఉపయోగించడం ‘అనధికార / చట్టవిరుద్ధం’ అవుతుంది.

యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
దేశ భద్రత దృష్ట్యా కేంద్రం శాటిలైట్‌ ఇంటర్నెట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌  శాటి లైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని భారత్‌లో అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడి నిబంధనలకు విరుద్ధంగా మస్క్‌ వ్యవహరిస్తున్నారంటూ కేంద్రం అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. స్టార్‌లింక్‌ ప్రీ బుకింగ్స్‌ నిలిపివేసింది. భారత్‌లో స్టార్‌ లింక్‌ లైసెన్స్‌ పొందలేదని, ఆ సేవల్ని కొనుగోలు చేయోద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ఐఫోన్‌ 14 ప్రో' ను విడుదల చేయాలంటే 
యాపిల్ ఐఫోన్ 14 ప్రో విడుదల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అయితే, ప్రస్తుతం మన దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధనల్ని కేంద్ర సవరిస్తుందా? సవరించకుండా ప్రభుత్వం ఐఫోన్ కోసం మినహాయింపు ఇస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. శాటిలైట్ కాలింగ్, మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేస్తే ఐఫోన్ 14 ప్రోను లాంఛ్‌ చేసుకునే వీలుంటుంది.

చదవండి👉 మార్చుకోం : ఐఫోన్‌14 సిరీస్‌ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే!

మరిన్ని వార్తలు