భారత్‌లో యాపిల్‌ రికార్డు

31 Oct, 2020 06:14 IST|Sakshi

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 8 లక్షల ఫోన్లు విక్రయం  

న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ భారత్‌లోనూ దుమ్మురేపుతోంది. భారత్‌ సహా పలు మార్కెట్లలో పటిష్టమైన పనితీరు ఆసరాతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో యాపిల్‌ రికార్డు స్థాయిలో 64.7 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 59 శాతం విదేశీ అమ్మకాల ద్వారా వచ్చిందే కావడం గమనార్హం. ఇక నికర లాభం 12.67 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్‌లో యాపిల్‌ భారత్‌లో మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

కాగా, రీసెర్చ్‌ సంస్థ కెనాలిస్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం యాపిల్‌ జూలై–సెప్టెంబర్‌ కాలంలో రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో సుమారు 8 లక్షల ఐఫోన్‌లను విక్రయించినట్లు అంచనా. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల భాగస్వామ్యంతో యాపిల్‌ ఇటీవలే భారత్‌లో ఐఫోన్‌ 11 అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. ‘భౌగోళికంగా, అమెరికా, యూరప్, మిగతా ఆసియా పసిఫిక్‌లో మేం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రికార్డులు సృష్టించాం. భారత్‌లోనూ మాకు ఇది రికార్డు క్వార్టర్‌గా నిలిచింది. తాజాగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ స్టోర్‌కు భారత్‌లో అపూర్వ ఆదరణ లభించడం ఆనందం కలిగిస్తోంది’ అని ఫలితాల ప్రకటన సందర్భంగా యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు