యాపిల్‌ ఇండియా ఆదాయం రెట్టింపు

30 Jul, 2022 02:19 IST|Sakshi

న్యూయార్క్‌: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లలో జూన్‌ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్‌లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు.

రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్‌ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు కుక్‌ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్‌ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్‌బుక్‌ ఎయిర్‌ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్‌ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్‌ చేస్తోందని కుక్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు