‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ భారీ షాక్‌!

10 Dec, 2022 12:56 IST|Sakshi

చైనా నుంచి ఒక్కొక్క కంపెనీ తరలి వెళ్లిపోతుంది. ప్రముఖ కంపెనీలు భారత్‌కు క్యూ కడుతున్నాయి. మొబైల్‌ దిగ్గజం యాపిల్‌కు విడి భాగాలు సరఫరా చేసే ఫాక్స్‌కాన్‌ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం..యాపిల్‌కు అతిపెద్ద తయారీ భాగస్వామి సంస్థ, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌..భారత్‌లో 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. చైనా నుండి ఉత్పత్తిని తరలించడంపై యాపిల్‌ ప్రయత్నిస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సూచించిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక వెలుగులోకి వచ్చింది.  

విజృంభిస్తున్న కోవిడ్‌-19
డ్రాగన్‌ కంట్రీలో రోజుకు 20 వేలు అంతకన్నా ఎక్కువ కోవిడ్‌ కేసులు విజృంభిస్తున్న కారణంగా అక్కడ అమలు చేస్తున్న కఠిన లాక్‌ డౌన్‌ నిబంధనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈ సారి ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఫ్యాక్టరీలో తయారీని కొనసాగించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీలో క్వారంటైన్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులో నెలల తరబడి ఉంచుతున్నారు. కొన్ని చోట్ల ఇనుప కంచెలు వేసి సిబ్బంది తప్పించుకోకుండా ఏర్పాట్లు చేశారు. కంపెనీలు, ఫ్యాక్టరీల వెలుపల భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. 

తిరగబడ్డ యాపిల్‌ ఉద్యోగులు
ఫలితంగా నెలల తరబడి క్వారంటైన్‌ కేంద్రాల్లో మగ్గిపోతున్న కార్మికులు, సిబ్బంది ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా యాపిల్‌ ఫోన్‌ ప్రధాన తయారీ భాగస్వామి జెంగ్షూలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యాయి. వీరిని నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ  సిబ్బందితో వారు ఘర్షకు దిగారు. దీంతో ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

‘నా దారి నేను చూసుకుంటా’
అక్కడి ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడడంతో..ఐఫోన్‌ తయారీని చైనా వెలుపలి దేశాలకు తరలించాలని యాపిల్‌ తన కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. మార్కెట్‌ కేపిటలైజేషన్‌ వ్యాల్యూలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీగా యాపిల్‌ తన ఉత్పత్తులైన ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతుంది. ఈ తరుణంలో యాపిల్‌ సూచనతో ఫాక్స్‌కాన్‌ భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధమైంది.  

ఫాక్స్‌కాన్ విషయానికి వస్తే
ఫాక్స్‌కాన్‌  2019 నుండి మనదేశంలో యాపిల్‌ ఐఫోన్ 11 నుంచి తయారీని ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 మోడల్‌ను అసెంబుల్‌ చేస్తోంది. ఇప్పుడు దాని సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ఇతర ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. 

ఐప్యాడ్‌ను
భారత్‌ లో ఇతర ప్రొడక్ట్‌లను తయారు చేసే అవకాశలను అన్వేషించేందుకు కేంద్రంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇతర దేశాలకు ప్రత్యామ్నాయంగా యాపిల్‌.. తన ఐపాడ్‌లను అసెంబుల్‌ కోసం మనదేశం వైపు చూస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చైనా వద్దు.. భారత్‌ ముద్దు
భారత్‌లో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌,పెగాట్రాన్‌లు యాపిల్‌ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కంపెనీలు భారత్‌లో ఐప్యాడ్‌ అసెంబుల్‌ చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక నైపుణ్యం, ప్రతిభ గల సిబ్బంది లేకపోవడం ఆందోళన వ్యక్త మవుతుంది. అయినా సరే ఫాక్స్‌ కాన్ $500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో సమీకరణాలు మారనున్నాయని, యాపిల్ గతంలో కంటే ఉత్పత్తికి కేంద్రంగా భారత్‌ అనువైన దేశమని భావిస్తోందంటూ చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు