ఆర్సెలర్‌ నిప్పన్‌ చేతికి ఎస్సార్‌ ఆస్తులు

22 Nov, 2022 07:28 IST|Sakshi

పోర్టులు, పవర్‌ ఇన్‌ఫ్రా విక్రయం పూర్తి 

న్యూఢిల్లీ: సొంత(వినియోగ) పోర్టులు, విద్యుత్‌ మౌలిక ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేసినట్లు రూయాల కుటుంబ సంస్థ ఎస్సార్‌ గ్రూప్‌ తాజాగా వెల్లడించింది. గుజరాత్‌లోని హజీరా, ఒడిషాలోని పారదీప్‌వద్ద గల ఈ ఆస్తులను ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా(ఏఎంఎన్‌ఎస్‌)కు అమ్మివేసినట్లు తెలియజేసింది. వెరసి ఎస్సార్‌ పోర్ట్స్‌ అండ్‌ టెర్మినల్స్‌(ఈపీటీఎల్‌), ఎస్సార్‌ పవర్‌ లిమిటెడ్‌(ఈపీఎల్‌)ను 2.05 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) విక్రయించింది.

దీంతో రుణరహితంగా మారే బాటలో ఆస్తుల మానిటైజేషన్‌ను పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. డీల్‌లో భాగంగా 270 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు, 25 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంగల హజీరా(గుజరాత్‌) పోర్టు, 12 ఎంటీ వార్షిక సామర్థ్యంగల పారదీప్‌(ఒడిషా) పోర్టు ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ సొంతమయ్యాయి. కాగా.. ఆస్తుల మానిటైజేషన్‌తో 25 బిలియన్‌ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు) రుణ చెల్లింపులను పూర్తి చేయడం ద్వారా గ్రూప్‌ రుణరహితంగా నిలిచినట్లు ఎస్సార్‌ క్యాపిటల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ రూయా పేర్కొన్నారు.

చదవండి: ఊహించని షాక్‌.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్‌ డిమాండ్‌, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!

మరిన్ని వార్తలు