ఉద్యోగాల ఊచకోత: ఫౌండర్స్‌ ఆ పనిచేయొచ్చుగా? అష్నీర్‌ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు

23 Jan, 2023 15:33 IST|Sakshi

సాక్షి, ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్‌ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో కోత ఎందుకు? సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని  స్వయంగా ఫౌండర్స్‌ జీతాలు తగ్గించుకోవచ్చుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయాలు క్షీణత,  ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే బదులు ఫౌండర్లు తమ వేతనాల్లో  కోత విధించుకోవచ్చు కదా ఆయన  సూచించడం తీవ్ర చర్చకు దారి తీసింది.    

ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేకుండా, వ్యవస్థాపకుడిగా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐటీ, సహా పలు రంగాలల్లో ఉద్యోగాల కోతపై స్పందించిన గ్రోవర్ ఈ కీలక వ్యఖ్యలు చేశారు. ప్రతీరోజు ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు వినడం విచారకరం. అదృష్టవశాత్తూ తాను అలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సంతోషంగా ఉంది. నియామకాల విషయాల్లో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటాం. అలాగే జాబ్స్‌ కట్‌లో ఫౌండర్స్‌గా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సి ఉందంటూ తాజా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో గ్రోవర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల తీసివేతకు ప్రత్యామ్నాయంగా తాను కొంతకాలం క్రితం 25-40 శాతం జీతం తగ్గించుకున్నా అని గుర్తు చేశారు. మిగిలిన, వ్యవస్థాపకులు ఈ మార్గంలో ఎందుకు ఆలోచించడం లేదో తనకు అర్థం కావడం లేదు. శక్తి, మూలధనం, సాంకేతికత, ప్రతిదానికీ ఉన్న ప్రాధాన్యత ఉద్యోగులకు ఎందుకు ఉండదు అంటూ ఆయన ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు